
Nalgonda road accident: నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందడం విషాదం కలిగించింది. విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. పుణ్యక్షేత్ర దర్శనం నుంచి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్లోని గుర్రంగూడకు చెందిన పి. దుర్గ (25) తన భర్త, చిన్న కుమారుడితో కలిసి చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని స్కూటర్పై దర్శించుకున్నారు. తిరిగి వస్తుండగా, నల్గొండ జిల్లా పరిధిలో గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి స్కూటర్ను ఢీకొట్టింది.
దీంతో ముగ్గురు రోడ్డుపై పడిపోయారు. ప్రమాదంలో దుర్గకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆమె భర్త మరియు కుమారుడికి స్వల్ప గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
