Nomination In Jubilee Hills: జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో ఒక వినూత్న దృశ్యం కనిపించింది. తెలంగాణ ఉద్యమ కారులు సంఘం అధ్యక్షుడు పూస శ్రీనివాస్, స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించారు.

ముషీరాబాద్ కు చెందిన శ్రీనివాస్, ఈసారి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని నిర్ణయించారు. కారణం — ఈ ప్రాంతంలో గంగపుత్ర కమ్యూనిటీకి చెందిన సుమారు 20,000 మంది ఓటర్లు ఉన్నారు.
నామినేషన్ వేయడానికి ఆయన ముత్యన్న అనే రిక్షా యజమాని వద్ద నుండి రూ.2,000కు ఓపెన్ రిక్షా అద్దెకు తీసుకుని, డప్పు మోగిస్తూ, పూల హారంతో, తెల్ల ధోతీ ధరించి తిరుగుతూ ప్రజల దృష్టిని ఆకర్షించారు.
ముషీరాబాద్ నుండి షేక్పేట్ రిటర్నింగ్ ఆఫీస్ వరకు కారు ద్వారా వచ్చి, అక్కడి నుండి సుమారు 500 మీటర్ల దూరం రిక్షాపై ప్రయాణించారు. అయితే ఎన్నికల నియమావళి ప్రకారం రిక్షాలను ఆఫీస్ లోపల అనుమతించరని పోలీసులు తెలిపారు. దీంతో ఆయన రిక్షా దిగిపడి పాదయాత్రగా ఆఫీస్ చేరుకున్నారు.
“జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నా సమాజం గంగపుత్ర ఓటర్ల మద్దతుతోనే నేను పోటీ చేస్తున్నాను. షేక్పేట్, బోరబండ, యూసుఫ్గూడ, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో మా వర్గం బలంగా ఉంది. గతంలో నేను భువనగిరి, మునుగోడు వంటి ప్రాంతాల నుంచి 14 సార్లు పోటీ చేశాను కానీ గెలవలేకపోయాను,” అని పూస శ్రీనివాస్ తెలిపారు.
ప్రస్తుతం ఉపఎన్నికల వేళ జూబ్లీ హిల్స్ లో రాజకీయ వేడి చెలరేగుతుండగా, పూస శ్రీనివాస్ వినూత్న నామినేషన్ చర్చనీయాంశమైంది.
Read More: Read Today’s E-paper News in Telugu
