
Thar Car Crash, మద్యం మత్తులో థార్ డ్రైవర్ అతివేగం, వరుస ఢీలు; బైక్ పై యువతి తీవ్రంగా గాయపడి ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు
హైదరాబాద్: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీఎన్రెడ్డినగర్ సమీపంలోని గుర్రంగూడ వద్ద శనివారం అర్ధరాత్రి ఓ భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ థార్ కారు డ్రైవర్ అతివేగంతో వాహనాన్ని నడిపి వరుస ప్రమాదాలకు కారణమయ్యాడు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఇంజాపూర్ నుంచి గుర్రంగూడ వైపు వేగంగా దూసుకొచ్చిన థార్ కారు అదుపు తప్పింది. ముందుగా రోడ్డుపై సాఫీగా వెళ్తున్న ఓ బైక్ను బలంగా ఢీకొట్టింది. ఆ బైక్పై సిరిసిల్లకు చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రయాణిస్తుండగా, ప్రమాదంలో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఆ తర్వాత కారు ఆగకుండా డివైడర్ను దాటుకుని ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రభావంతో థార్ వాహనం గాల్లోకి లేచి మూడు పల్టీలు కొట్టి రోడ్డుపై పడిపోయింది.
ఈ ప్రమాదంలో థార్ కారులో ఉన్న డ్రైవర్తో పాటు యజమాని అనిరుధ్కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే, ఎదురుగా వచ్చిన రెండో కారులో ప్రయాణిస్తున్న దినేష్, శివ అనే ఇద్దరు వ్యక్తులు కూడా గాయపడ్డారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు క్షతగాత్రులను హస్తినాపురంలోని రెండు వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ మద్యం సేవించి ఉండటంతో పాటు అతివేగంతో ప్రయాణించడం ప్రమాదానికి కారణమైనట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
