Babu Jagjivan Ram Jayanti 2025 నిర్మల్ జిల్లా : శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డా. బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలలో అధికారులు, నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ – డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని జిల్లా స్థాయిలో అధికారికంగా నిర్వహిస్తూ, మహనీయుడి సేవలను స్మరించుకోవడం మనందరికీ గర్వకారణం అని తెలిపారు. స్వాతంత్ర్య భారతదేశానికి ఒక దీపస్తంభంలా నిలిచారని, సామాజిక సమానత్వానికి, దళితుల హక్కుల కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం చారిత్రాత్మకమైనదని తెలిపారు. భారత ఉప ప్రధాన మంత్రి గా, కార్మిక, వ్యవసాయ, రక్షణ శాఖ మంత్రిగా వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. అత్యంత కఠిన పరిస్థితుల్లో, నిరంకుశ భేదాభిప్రాయాలను ఎదుర్కొంటూ, విద్య, విజ్ఞానం, విలువలతో ఆయన ఎదిగిన విధానం నేటి యువతకు ఒక ప్రేరణగా నిలుస్తుందన్నారు. అంటరానితనాన్ని నిర్మూలించేందుకు చేసిన కృషి సమాజానికి దిశానిర్దేశకంగా నిలిచాయని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం అహర్నిశలు శ్రమించిన నేతగా బాబు జగ్జీవన్ రామ్ భారత చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. నేటి యువత జగ్జీవన్ రామ్ జీవితం నుండి ప్రేరణ పొందాలాని, ఆయన ఆదర్శాలను అనుసరించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖల అధికారులు రాజేశ్వర్ గౌడ్, శ్రీనివాస్, అంబాజీ, శంకర్, సిబ్బంది, దళిత సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


