Sajjanar Warning to Children: తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. వృద్ధుల నుంచి వస్తున్న ఫిర్యాదులు రోజురోజుకూ పెరుగుతుండటం తనను తీవ్రంగా కలచివేస్తోందని ఆయన అన్నారు.

సైబర్ నేరాలు, మహిళలపై నేరాలు వంటి కేసులతో పాటు ఇప్పుడు వృద్ధ తల్లిదండ్రులు తమ పిల్లలే తమను పట్టించుకోవడం లేదని బాధతో తనను కలుస్తున్నారని సజ్జనార్ తెలిపారు. కొందరు పిల్లలకు ఫోన్ చేసి చెప్పమని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మరికొందరు తమను వృద్ధాశ్రమాలకు తరలించాలంటూ కూడా వేడుకుంటున్నారని చెప్పారు.
ఇలాంటి పరిస్థితులు సమాజానికి ఆందోళనకరమని పేర్కొన్న సజ్జనార్, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారికి గట్టి హెచ్చరిక ఇచ్చారు. “ఈరోజు మీరు మీ తల్లిదండ్రులను ఎలా చూస్తున్నారో, రేపు మీ పిల్లలు మిమ్మల్ని కూడా అలాగే చూసే అవకాశం ఉంది. ఇది గుర్తుంచుకోండి” అని ఆయన అన్నారు.
వయసు పెరిగేకొద్దీ ఆరోగ్య సమస్యలు, ప్రవర్తనలో మార్పులు రావడం సహజమని, వాటిని కారణంగా చూపి తల్లిదండ్రులను వదిలేయడం తప్పని సజ్జనార్ స్పష్టం చేశారు. తమ జీవితాన్ని త్యాగం చేసి పిల్లలను చదివించి, మంచి స్థితిలో నిలబెట్టిన తల్లిదండ్రుల పట్ల పిల్లలకు బాధ్యత ఉందని గుర్తుచేశారు.
తల్లిదండ్రుల సంరక్షణ కేవలం చట్టపరమైన బాధ్యత మాత్రమే కాకుండా, మనిషిగా ఉండే కనీస ధర్మమని సజ్జనార్ వ్యాఖ్యలు సమాజంలో చర్చకు దారితీస్తున్నాయి.
Read More: Read Today’s E-paper News in Telugu
