Telanganapatrika (July 22): మహిళల అభివృద్ధే దేశ అభివృద్ధి , ఇల్లంతకుంట మహిళ సమాఖ్య దేశానికే ఆదర్శంగా నిలిచిందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కొనియాడారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని మంగళవారం ఇందిరా మహిళా శక్తి సంబురాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై వడ్డీలేని రుణాలు, బీమా మొత్తాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నుంచి ఇల్లంతకుంట మండల ఆదర్శ మహిళా సమాఖ్య జాతీయ స్థాయిలో ‘ఆత్మ నిర్భర్ సంఘటన్’ అవార్డు అందుకోవడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఐకేపీ ద్వారా బ్యాంకు లింకేజీ, స్ర్తీనిధి రుణాలు అందిపుచ్చుకొని వ్యాపార రంగాల్లో రాణిస్తూ తెలంగాణలో ఇతర స్వశక్తి సంఘాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.
మహిళల అభివృద్ధే దేశ అభివృద్ధి స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకోండి!
మహిళలు ఆర్థికంగా బలోపేతమైనప్పుడే దేశం ప్రగతి సాధిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నారని,అందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పించారని చెప్పారు. ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు మేలు జరిగితే మళ్లీ రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పేద్ధపీట వేయడం జరిగిందన్నారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన దిశగా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంఘాల ఉనికి దెబ్బతీసేలా వ్యవహరిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళ సంఘాలను మరింత శక్తివంతం చేస్తున్నదన్నారు. మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్, ఆర్టీసీ సంస్థకు అద్దె బస్సులు, పెట్రోల్ పంప్, ధాన్యం కొనుగోలు, రైస్ మిల్ వంటి అనేక వ్యాపారాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం నూతనంగా అందించే రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లను కూడా మహిళల పేరు మీద మంజూరు చేస్తుందని అన్నారు. గత పాలకుల హయాంలో నిర్లక్ష్యం చేసిన వడ్డి లేని రుణాలను ప్రజా ప్రభుత్వంలో పునరుద్దరించామని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో శేషాద్రి, ఇల్లంతకుంట తహసీల్ధార్ ఎంఏ ఫారుఖ్, మండల అభివృద్ధి అధికారి వై.శశికళ, ఐకేపీ ఏపీఎం కట్ట వాణిశ్రీ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మండల పరిషత్ మాజీ అధ్యక్షులు ఊట్కూరి వెంకటరమణారెడ్డి, గుడిసె అయిలయ్య యాదవ్, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి, పార్టీ నాయకులు ఐరెడ్డి మహేందర్ రెడ్డి, పసుల వెంకటి, పాశం రాజేందర్ రెడ్డి, ఎనగందుల ప్రసాద్, మాతంగి అనిల్, టీ.వీరేశం, ఆకుల సత్యం, సురేందర్ రెడ్డి, సత్యారెడ్డి, కె.నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu