Telangana Cabinet Meeting: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమైన క్యాబినెట్ సమావేశాన్ని నవంబర్ 15న నిర్వహించనుంది. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, అలాగే గిగ్ వర్కర్స్ సంక్షేమ బిల్లు వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

మొదట ఈ సమావేశం నవంబర్ 7న జరగాల్సి ఉండగా, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల దృష్ట్యా అది వాయిదా పడింది. ఇప్పుడు ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఈ సమావేశం జరగనుంది.
స్థానిక సంస్థల ఎన్నికల దిశగా అడుగులు
సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు పాత రిజర్వేషన్ విధానంలో నిర్వహించడంపై చర్చ జరగనుంది. హైకోర్టు సూచనల ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50% లోపే ఉండాలని ప్రభుత్వం నిర్ణయించనుంది.
ఇక బీసీ సంఘాలు 42% రిజర్వేషన్ కోసం పట్టుబడుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలు అభ్యర్థుల ఎంపికలోనే బీసీ రిజర్వేషన్లను ప్రతిబింబించాలని ప్రతిపాదించనుంది.
గ్రామ, మండల, ZPTC ఎన్నికలు డిసెంబర్లోనే?
క్యాబినెట్ ఆమోదం అనంతరం, పంచాయతీరాజ్ శాఖ జిల్లా కలెక్టర్ల ద్వారా రిజర్వేషన్ జాబితాను రూపొందించి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు పంపనుంది. ఇప్పటికే కమిషన్ ఎన్నికల షెడ్యూల్ సిద్ధం చేసుకుందని సమాచారం. డిసెంబర్ నాటికి గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగవచ్చని సూచనలు ఉన్నాయి.
ప్రజా ప్రభుత్వం విజయోత్సవం కూడా అజెండాలో
డిసెంబర్ మొదటి వారంలో జరగనున్న ‘ప్రజా ప్రభుత్వం విజయోత్సవం’తో ఎన్నికల ప్రచారం సమాంతరంగా సాగవచ్చని అంచనా.
ఈ సందర్భంగా రెవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలనలో సాధించిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చర్చకు వస్తాయి.
Telangana Cabinet Meeting ఇతర అంశాలు కూడా చర్చలో
క్యాబినెట్ సమావేశంలో మరికొన్ని కీలక అంశాలు కూడా చర్చించనున్నారు:
- గిగ్ వర్కర్స్ సంక్షేమ బిల్లు ఆమోదం
- కొత్త విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటు
- పెండింగ్ ఫండ్ల విడుదల
- శాఖల పనితీరు సమీక్ష
Read More: Read Today’s E-paper News in Telugu
