MLA Mahipal Reddy: పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో రాజకీయ కలకలం రేపుతున్నాయి. ఇటీవల పటాన్చెరులో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో, తన అనుచరులతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్లో చేరడం తప్పు నిర్ణయమని వ్యాఖ్యానించినట్లు సమాచారం.

ఆ సమయంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్లో చేరానని, అయితే ఆ నిర్ణయం వల్ల తనకు కానీ, తన నియోజకవర్గ ప్రజలకు కానీ ఎలాంటి ప్రయోజనం కలగలేదని మహిపాల్ రెడ్డి పేర్కొన్నారని సమావేశానికి హాజరైన వర్గాలు చెబుతున్నాయి. “కాంగ్రెస్లో చేరడం వల్ల నాకు గానీ, ప్రజలకు గానీ కణమాత్రం కూడా లాభం జరగలేదు” అని ఆయన అన్నట్లు తెలుస్తోంది.
Patancheru-mla-mahipal-reddy-congress-comments
తన రాజకీయ ప్రయాణాన్ని ప్రస్తావించిన మహిపాల్ రెడ్డి, తాను భారత రాష్ట్ర సమితి (BRS) నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లో ఉన్న మొత్తం 104 కౌన్సిలర్ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశం వ్యక్తిగతంగా జరిగినప్పటికీ, ఆయన వ్యాఖ్యలు బయటకు రావడంతో కాంగ్రెస్ శిబిరంలో చర్చలకు దారి తీస్తున్నాయి. మరోవైపు, బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్సాహం పెరిగినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
