uoh crrao laptop theft, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లోని సీఆర్ రావు అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ (AIMSCS) లోని కంప్యూటర్ ల్యాబ్ నుంచి రూ.12 లక్షల విలువైన 60 ల్యాప్టాప్లు దొంగిలించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

ఫిబ్రవరి 9 సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల మధ్య ఈ చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ల్యాబ్ కిటికీని పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు ముందుగా సీసీటీవీ కేబుల్ను కట్ చేసి, అక్కడ ఉన్న అన్ని ల్యాప్టాప్లను తీసుకుని పారిపోయారు.
ఈ ఘటనపై AIMSCS రిజిస్ట్రార్ సి.ఎన్. వర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.
సీఆర్ రావు AIMSCS ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన విద్యాసంస్థగా పనిచేస్తూ, జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్తో కలిసి బీటెక్ (ఇంజినీరింగ్) కోర్సులను అందిస్తోంది.
భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 331(4) మరియు 305(a) కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ బృందం ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించింది.
భవనం ప్రవేశద్వారం వద్ద విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది ఎలాంటి అనుమానాస్పద కదలికలు గమనించలేదని పోలీసులు తెలిపారు.
