Jagtial man builds own tomb: మరణం అనే మాట వింటేనే చాలా మంది భయపడతారు. కానీ జగిత్యాల జిల్లా గ్రామీణ మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు మాత్రం మరణాన్ని భయపడకుండా, ప్రశాంతంగా స్వీకరించాడు. 80 ఏళ్ల వయసులోనే తన సమాధిని తానే నిర్మించుకోవడం ఇప్పుడు గ్రామమంతా చర్చకు దారి తీసింది.

Jagtial man builds own tomb నక్క ఇంద్రయ్య అనే ఈ వృద్ధుడు తన ఆరోగ్యం పూర్తిగా బాగుండగానే, దాదాపు రూ.12 లక్షల వ్యయంతో తన సమాధిని నిర్మించుకున్నాడు. ఈ సమాధి ఆయన దివంగత భార్య సమాధి పక్కనే ఉండడం అందరినీ భావోద్వేగానికి గురి చేస్తోంది. గ్రామస్తులు దీనిని “అమరమైన సహజీవనానికి ప్రతీక”గా అభివర్ణిస్తున్నారు.
సాధారణ సమాధిలా కాకుండా, అత్యుత్తమ నాణ్యత గల మార్బుల్తో అందంగా ఈ నిర్మాణం చేయించుకున్నాడు. ముఖ్యంగా విశేషమేమిటంటే – ఇంద్రయ్య రోజూ తన సమాధిని సందర్శిస్తాడు. అక్కడ శుభ్రం చేస్తూ, మార్బుల్ను తుడుస్తూ, చుట్టూ నాటిన చెట్లకు నీళ్లు పోస్తూ కొంతసేపు ప్రశాంతంగా కూర్చుని ఇంటికి తిరిగి వెళ్తాడు.
యువకుడిగా ఉన్న రోజుల్లో బిల్డర్గా పనిచేసిన ఇంద్రయ్య, తన జీవితంలో అనేక నిర్మాణాలు చేశానని చెబుతున్నాడు.
“నాలుగు ఐదు ఇళ్లు, 20 ఎకరాల్లో ఒక స్కూల్, ఒక చర్చ్ కట్టాను. ఇది నా చివరి ప్రాజెక్ట్. నా సమాధి కట్టుకోవడం నాకు చాలా సంతోషం ఇచ్చింది” అని ఆయన చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.
చాలామంది సమాధులను విషాదంతో అనుసంధానిస్తే, ఇంద్రయ్య మాత్రం దాన్ని జీవితం యొక్క సహజ ముగింపుగా చూస్తున్నాడు. జీవితం చివరి వరకూ ఏదీ మనదికాదు అనే భావనతో జీవించడం వల్లే తనకు ఎలాంటి భయం లేదని ఆయన అంటున్నారు.
మరణాన్ని ఆరోగ్యంగా ఉన్నప్పుడే స్వీకరించడం ద్వారా, దాని పట్ల ఉన్న భయాన్ని పూర్తిగా జయించానని ఇంద్రయ్య నమ్మకం. ప్రస్తుతం ఈ సంఘటన లక్ష్మీపురం గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ విస్తృతంగా చర్చకు వస్తోంది.
Read More: Read Today’s E-paper News in Telugu
