Kondagattu Anjanna Temple: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జనవరి 3న రానున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానాల (TTD) ఆధ్వర్యంలో నిర్మించనున్న గెస్ట్ హౌస్, దీక్ష మండపానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారని అధికారులు వెల్లడించారు.

Kondagattu Anjanna Temple TTD ఆధ్వర్యంలో కొండగట్టులో 100 గదులతో గెస్ట్ హౌస్తో పాటు, సుమారు 2,000 మంది భక్తులు కూర్చునేలా దీక్ష మండపం నిర్మించేందుకు ఇప్పటికే బోర్డు సమావేశంలో తీర్మానం ఆమోదం పొందింది. ఈ నిర్మాణాల వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మరింత సౌకర్యం కలగనుంది.
శనివారం TTD ఇంజినీరింగ్ విభాగం అధికారులు కొండగట్టుకు చేరుకుని, నిర్మాణాలకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అన్ని సదుపాయాలు కలిగిన భవనాలను నిర్మించాలనే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.
గతంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం, జూన్ 29న పవన్ కల్యాణ్ కొండగట్టు ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆయనకు ఆరాధ్య దైవంగా ప్రసిద్ధి. ఆ సమయంలో ఆలయ అధికారులు, అర్చకులు భక్తులకు గెస్ట్ హౌస్ సదుపాయాలు లేవని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు.
దీనికి స్పందించిన పవన్ కల్యాణ్, వెంటనే TTD ద్వారా గెస్ట్ హౌస్, దీక్ష మండపం నిర్మాణానికి చర్యలు ప్రారంభించారు. ఇప్పుడు జనవరి 3న శంకుస్థాపనతో ఈ ప్రాజెక్టులుగా ప్రారంభం కానున్నాయి. దీంతో కొండగట్టు ఆలయానికి వచ్చే లక్షలాది భక్తులకు మరింత సౌకర్యం అందనున్నది.
Read More: Read Today’s E-paper News in Telugu
